తల్లి భాష చేత తమిళ తంబియైన
మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ రాష్ట్ర గీతాన్ని రాసిన ప్రసన్న కవి కీర్తిశేషులు శంకరంబాడి సుందరాచారి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఇష్టమైన తేటగీతిలో
1 తల్లి భాష చేత తమిళ తంబియైన
పుట్టి పెరిగినట్టి తెలుగు భూమియందు
మమతఁజూపుచూ వేసేను మల్లె దండ
రాష్ట్ర గీతమై వినిపించె రాజ్యమంత!
2. బాపు హత్యను ఖండించి బాధపడుచు
కంట నీరిడె బలిదాన కావ్యమందు
భక్తిఁ జాటెను సుందర భారతమున
రక్తిఁగట్టించె సుందర రామ చరిత!
3. ఏడుకొండలవాడిని వేడుకొనుచు
శతక శ్రీనివాసమురాసె చక్కగాను
బుద్ధగీతినఁదెలిపెను బుద్ధ చరిత
సకల ప్రక్రియ లందున సవ్యసాచి!
4. తెలుగు తోటను బుట్టిన తేటగీతి
పద్య మందునఁజక్కని భావములను
మృదు మధురముగఁజాటుతూ మదినిదోచె
శంకరంబాడి సుందరాచారి శైలి
🙏రాచమల్ల మల్లికార్జున్
Comments
Post a Comment